పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ & సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జయకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు తరలివచ్చి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా సోదాలు చేపట్టారు.
ముఖ్యంగా గ్రామంలో ఉన్న రౌడీషీటర్లు, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, వారి ప్రస్తుత కార్యకలాపాలపై ఆరా తీశారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సోదాల సమయంలో బయటపడిన కత్తులు, గొడ్డళ్లు వంటి ఆయుధాలను పట్టుకున్నారు.
గ్రామంలో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలను సేకరించిన పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కఠినంగా హెచ్చరించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు
ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, పల్నాడు జిల్లా
.
