విజయనగరం లోని ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు శాస్త్రోక్తంగా శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ విస్తరణ పనులు పూర్తై అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారంతో ఆలయ విస్తరణ విజయవంతమైందని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం ఆరు నెలల్లో ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు.
ఈ ఆలయం రాష్ట్రంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన ఆలయ విస్తరణ సాకారమైందని, భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
