తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. దీవుల్లో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన వివరాలు వెల్లడించారు.
స్థానిక సంస్థల్లో టీడీపీ ప్రస్తుతం ద్వితీయ స్థానంలో నిలుస్తోందని మాణిక్య యాదవ్ తెలిపారు. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒకసారి అండమాన్ నికోబార్ దీవులకు పర్యటించాలని చంద్రబాబును ఆయన కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు, త్వరలోనే దీవుల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి కూడా టీడీపీ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ స్థాపన తర్వాతే తెలంగాణలో సామాన్య ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నర్శింహులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలనకు చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు.
