విదేశాల నుంచి విరాళాలు తీసుకునే సంస్థలపై మరొక్కమారు కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం (FCRA)–2010 కింద వివిధ ఉల్లంఘనలకు సంబంధించిన కాంపౌండింగ్ జరిమానాలను భారీగా పెంచింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ మార్పులు ఎఫ్సీఆర్ఏ చట్టంలోని సెక్షన్ 41 ప్రకారం అమలులోకి వచ్చాయి. 2022 జూలైలో ప్రకటించి, 2023 ఫిబ్రవరిలో సవరించిన కాంపౌండింగ్ షెడ్యూల్లో ఇప్పుడు మరిన్ని మార్పులు చేశారు. విదేశీ నిధుల స్వీకరణ, వినియోగానికి సంబంధించిన కొన్ని ఉల్లంఘనలపై జరిమానాలను పెంచారు.
నిర్వాహక ఖర్చుల కోసం అనుమతించిన 20 శాతం పరిమితిని మించి విదేశీ నిధులను ఖర్చు చేసిన సంస్థలకు రూ.1 లక్ష లేదా పరిమితిని మించి ఖర్చు చేసిన మొత్తంలో 5 శాతం, వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం జరిమానాగా విధించబడుతుంది.
విదేశీ నిధులను ఊహాజనిత (స్పెక్యులేటివ్) పెట్టుబడుల కోసం వినియోగిస్తే రూ.1 లక్ష లేదా పెట్టుబడి చేసిన మొత్తంలో 30 శాతం, ఏది ఎక్కువైతే అది జరిమానాగా చెల్లించాలి. అదనంగా, ఆ పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తం లాభాలను కూడా ప్రభుత్వం తిరిగి వసూలు చేస్తుంది.
విదేశీ నిధులను వాటిని స్వీకరించిన అసలు ఉద్దేశానికి భిన్నంగా వినియోగించిన సందర్భాల్లో కూడా రూ.1 లక్ష లేదా సంబంధిత మొత్తంలో 30 శాతం, ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధించబడుతుంది.
ఎఫ్సీఆర్ఏ చట్టంలోని సెక్షన్ 11 నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులను స్వీకరించడం లేదా వినియోగించడం జరిగితే రూ.1 లక్ష లేదా స్వీకరించిన/వినియోగించిన విదేశీ నిధుల మొత్తంలో 30 శాతం, ఏది ఎక్కువైతే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, ఎఫ్సీఆర్ఏ నమోదు లేదా అనుమతి లేని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో విదేశీ నిధులను వినియోగించినా రూ.1 లక్ష లేదా వినియోగించిన మొత్తంలో 30 శాతం, ఏది ఎక్కువైతే అది జరిమానాగా విధించబడుతుంది.
నోటిఫికేషన్ విడుదలకు ముందే పరిష్కరించబడిన కేసులకు ఈ సవరణలు వర్తించవని, ఇప్పటికే ముగిసిన కేసులను తిరిగి తెరవబోమని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ సవరించిన నిబంధనలు భారత ప్రభుత్వ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తాయి.
