ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టును అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని మేల్కొల్పడంలో ఇన్నయ్య కీలక పాత్ర పోషించారని, ప్రజాస్వామ్య పంథాలోనే ఆయన తన ఆచరణను కొనసాగించారని గుర్తుచేశారు. ఇన్నయ్యను మావోయిస్టుల పేరుతో NIA అధికారులు అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, రాజ్యాంగబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చే కేంద్ర హోం శాఖ.. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న ఇన్నయ్యను ఎందుకు అరెస్ట్ చేసిందని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని, బీజేపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం ఉంటే వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఇన్నయ్య విశేష కృషి చేశారని.. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకుని ఇన్నయ్య విడుదలయ్యేలా చూడాలని క్రాంతి కిరణ్ కోరారు.
