జెఫ్రీ ఎప్ స్టిన్ గుర్తు ఉన్నాడా? లైంగిక అక్రమ రవాణా కేసులతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యక్తి. ఎస్ స్టిన్ ఫైల్స్ పేరుతో సంచలనాలు ఇంకా ఎంతో మంది పీఠాలు కదిలిస్తూనే ఉన్నాయి. అలాంటి ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎస్ స్టిన్ మరణించి ఏడేళ్లు గడిచినా, ఆయన ఆస్తులను ఎవరికి ఇవ్వాలి? అనే అంశం మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడు తాజా ఒక మహిళ రంగంలోకి వచ్చింది.
బెలారస్లో జన్మించి తర్వాత అమెరికా పౌరురాలిగా మారిన 37 ఏళ్ల దంత వైద్యురాలు డాక్టర్ కర్యనా షులియాక్ (Karyna Shuliak) ఎప్ స్టిన్ ఆస్తిలో నుంచి గరిష్ఠంగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.850 కోట్లకు పైగా) వారసత్వంగా పొందే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, కర్యనా షులియాక్ 2010లో స్టూడెంట్ వీసాపై బెలారస్ నుంచి అమెరికాకు వెళ్లింది. దంత వైద్యురాలిగా స్థిరపడాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమెకు కొలంబియా యూనివర్సిటీ డెంటల్ స్కూల్లో ప్రవేశం కల్పించడంలో ఎప్ స్టన్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఆమె ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు, జీవన వ్యయాలను కూడా ఎప్ స్టిన్ భరించినట్లు సమాచారం. అనంతరం గ్రీన్ కార్డు పొందేందుకు వివాహ ఏర్పాట్లు కూడా చేసినట్లు వార్తలు చెబుతున్నాయి. 2018లో ఆమె అమెరికా పౌరసత్వాన్ని పొందింది.
కర్యనా చదువుకుంటున్న సమయంలో ఆమె తల్లిని కూడా అమెరికాకు తీసుకురావడంలో ఎప్ స్టిన్ సహాయం చేసినట్లు సమాచారం. 2012లో కర్యనా పంపినట్లు చెప్పబడుతున్న ఒక సందేశంలో, తన విద్య, నివాసం, కుటుంబానికి చేసిన సహాయానికి ఎప్ స్టిన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, “అందరిలోకెల్లా అత్యంత పవిత్రమైన వ్యక్తి” అని అభివర్ణించినట్లు చెబుతున్నారు.
2019 ఆగస్టులో జైలులో ఎప్ స్టిన్ మరణానికి కొద్ది రోజుల ముందు ఆయన తన వీలునామాను సవరించినట్లు సమాచారం. ఆ వీలునామాలో కర్యనా షులియాక్కు తన ఆస్తిలో గణనీయమైన భాగాన్ని కేటాయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, వివాహ ఉద్దేశంతో (“in contemplation of marriage”) అంటూ స్వహస్తాలతో రాసిన నోట్తో పాటు 33 క్యారెట్ల వజ్రపు ఉంగరాన్ని కూడా ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఎప్ స్టిన్ మరణించే సమయానికి ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయితే బాధితులకు చెల్లించిన పరిహారం, న్యాయపరమైన వ్యయాల తర్వాత ప్రస్తుతం ఎస్టేట్ విలువ 120 మిలియన్ నుంచి 200 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. ఆ ఆస్తి తుది పంపిణీ ఎలా జరుగుతుందనే దానిపై ఆధారపడి కర్యనా షులియాక్కు గరిష్ఠంగా 100 మిలియన్ డాలర్లు లభించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎప్ స్టిన్, కర్యనా దాదాపు ఎనిమిదేళ్ల పాటు సంబంధంలో ఉన్నారు. 2019 ఆగస్టు 10న న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఎప్ స్టిన్ మరణానికి ముందు ఆయన చివరిసారిగా ఫోన్ చేసిన వ్యక్తి కూడా కర్యనా షులియాక్ అని సమాచారం.
ముఖ్యంగా, కర్యనా షులియాక్ ఎప్పుడూ తనను ఎప్ స్టిన్ బాధితురాలిగా ప్రకటించుకోలేదని, అలాగే అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా ఆమెపై ఎప్ స్టిన్ లైంగిక అక్రమ రవాణా నేరాల్లో ప్రమేయం ఉందని ఎలాంటి అభియోగాలు మోపలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో 2019లో జైలులో ఎప్ స్టిన్ మృతి చెందాడు. ఆయన మరణాన్ని అమెరికా అధికారులు అధికారికంగా ఆత్మహత్యగా నిర్ధారించారు. అయినప్పటికీ, ఆయన మరణం, ఆస్తుల పంపిణీ, సంబంధిత వ్యక్తుల పాత్రపై చర్చలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
