వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. కృతయుగం:
నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు.
బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మమయిన పాలన నడిచినది. ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది.
సూర్య, గురువులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను.
తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.
2. త్రేతాయుగము:
త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
