చిలుకూరు బాలాజీ టెంపుల్ వ్యవస్థాపకుడు సీ.ఎస్. సౌందరరాజన్ కన్నుమూశారు. ఆడంబరాలు, ఆర్భాటాలు లేకుండా భగవంతుడి పట్ల భక్త, శ్రద్ధలతో వచ్చే వారందరికీ సమానంగా దర్శన భాగ్యం కల్పించాలనే సిద్ధాంతంతో చిలుకూరు ఆలయాన్ని నిర్వహించారు. విరాళాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆలయంలో హుండీని ఏర్పాటు చేయలేదు. 11 ప్రదక్షిణలు చేసి స్వామి వారి ముందు కోరికలు ఉంచి.. ఆ కోరికలు నెరవేరితే 108 ప్రదక్షిణలు చేసే సంప్రదాయాన్ని తీసుకొచ్చింది సౌందరరాజన్.
వీసా బాలాజీగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిలుకూరు దేవాలయంపై 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కన్ను పడింది. ఈ గుడిని దేవాదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించారు. ఆ రోజుల్లో చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులుగా ఉన్న సౌందరరాజన్.. వైఎస్ ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆలయం మీద పెత్తనం చేయాలనుకుంటే.. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే తాళాలు ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించారు. అప్పటికే తిరుమల వెంకటేశ్వర స్వామికి.. ఏడు కొండలపై హక్కు లేదు.. రెండు కొండలే టీటీడీ పరిధిలోకి వస్తాయనే జీవో తీసుకురావడంతో.. వైఎస్ ప్రభుత్వం తీరుపై భక్తుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో చిలుకూరు ఆలయం స్వాధీనం చేసుకొనే విషయంలో అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేసింది.
వైఎస్ సర్కారు నుంచి చిలుకూరు టెంపుల్ని రక్షించిన సౌందర్రాజన్.. టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాలను ప్రభుత్వాల నుంచి విముక్తి కోసం ఉద్యమం చేశారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు ఒక దళితుడిని తన భుజాలపై మోసుకొని ఆలయ ప్రవేశం చేయించి మునివాహన సేవ ద్వారా చరిత్ర సృష్టించారు.
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కమిషనర్గా పని చేసిన పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని పూర్తిగా భగవంతునికే అంకితం చేశారు. చిలుకూరు క్షేత్రాన్ని కేవలం ఒక గుడిగా కాకుండా.. నిరాడంబరతకు మారుపేరుగా తీర్చిదిద్దారు.
