అమరావతిని మార్చడం, కంపెనీలను తరిమేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఎలాంటి పనులు చేయడం వల్ల అధికారం కోల్పోయారో.. ప్రతిపక్షంలోకి వచ్చాకా అదే పని చేస్తానంటున్నారు. ఆయన వ్యవహారం చూస్తుంటే.. ఏపీనే మార్చేస్తాను.. రాష్ట్రాన్ని అండమాన్ తీసుకెళ్తాను అంటారేమో అని జనాలు భయపడి చస్తున్నారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి ప్రభుత్వం 30 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమికి హార్బర్తో సంబంధం లేదు. అయినా డిఫెన్స్ కంపెనీ వల్ల నష్టం జరుగుతుందని మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జగన్.
ఎక్కడికి వెళ్లినా.. అభివృద్ధిని అడ్డుకొని, పరిశ్రమలను తరిమేస్తా అనేలా జగన్ మాట్లాడటంపై పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతుతోంది. హార్బర్కు సంబంధం లేని ఖాళీ భూమిని డిఫెన్స్ కంపెనీకి ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. జగన్ మాత్రం వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ది కోసం అబద్దాలతో మత్స్యకారులను భయపెట్టేందుకు ప్రయత్నించారు. పరిశ్రమలతో స్థానికులకు మంచి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన లేకుండా ఏదో జరిగిపోతుందని ప్రభుత్వం మీద బురద జల్లడం దురదృష్టకరం.
పోనీ జగన్ హయాంలో ఏమైనా చేశారా అంటే.. ఈ జువ్వలదిన్నె హార్బర్నే పూర్తి చేయలేదు. అయినా ప్రారంభోత్సవం చేసేశారు. ఇది కూడా వెలుగొండ ప్రాజెక్టు, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నది నీళ్లివడం లాంటిదే అని బయటి వాళ్లకు తెలియకపోయినా స్థానికులకు తెలుసు. గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి సాగర్ డిఫెన్స్ వరకు రాష్ట్రానికి వచ్చిన ప్రతి కంపెనీని తరిమేసే విధంగా జగన్ చేస్తున్న రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. బాగు చేయకపోయినా పట్టించుకోరేమో గానీ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని.. జరుగుతున్న అభివృద్ధిని చెడగొడతానంటే జనాలు అస్సలు ఒప్పుకోరు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ఈ చిన్న లాజిక్ తెలుసుకోలేకపోవడం ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారుతోంది.
