సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టిస్తున్న ‘జోసెఫ్ రావణ్’ వీడియోల వెనుక ఒక పెద్ద నెట్వర్క్, భారీ కుట్ర దాగి ఉన్నట్లు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా నిందలు మోపేలా, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఈ వీడియోలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కాగా, ఇందులో పలువురు కీలక పాత్రధారులుగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఈ నెట్వర్క్కు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా రావణ్ బృందం లో సభ్యురాలు అయిన గమన కాల్ లాగ్లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల నెంబర్లు ఉండటం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్లో ఒక ఐఏఎస్ అధికారి ఫోన్ నెంబర్ నమోదు కావడం ఈ కేసులో ఉన్న ఉన్నత స్థాయి లింకులను స్పష్టం చేస్తోంది.
గతంలో సర్వీసులో ఉన్న సమయంలో తీవ్రమైన వైరం, విభేదాలు ఉన్న సదరు ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాక్షిగా ఒకటవ్వడం గమనార్హం. ఈ ముఠా సమాజంలో గందరగోళం సృష్టించేందుకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల ఒక వైసీపీ కీలక నేత నివాసాన్ని వేదికగా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. అక్కడే ఒక ప్రత్యేక స్టూడియోను ఏర్పాటు చేసి, ‘ప్రశ్న’ అనే పేరుతో సోషల్ మీడియా వేదికగా దూషణలు, తప్పుడు ప్రచారాలతో కూడిన వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై పోలీసుల లోతైన విచారణ కొనసాగుతుండగా, రోజురోజుకూ మరిన్ని కొత్త లింకులు, కీలక వ్యక్తుల పేర్లు బయటపడుతుండటంతో రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
