మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులపై అవగాహన కల్పించేందుకు ఫెహ్మికేర్ హాస్పిటల్ నిర్వహించిన రెండు రోజుల జాతీయ విద్యా సదస్సు “ఫెహ్మికాన్ 2026” (FEHMICON 2026) హైదరాబాద్లో ఘనంగా ముగిసింది.
అబ్స్టెట్రిక్స్ మరియు గైనకాలజీ రంగంలో AI సాంకేతికత ప్రాధాన్యతను చర్చించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సుకు తరలివచ్చారు. జూలై 11న ఫెహ్మికేర్ హాస్పిటల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్, జూలై 12న బంజారాహిల్స్లోని ఎం.జె. కాలేజ్ ఆడిటోరియం (గులాం అహ్మద్ హాల్) లో జాతీయ స్థాయి సీఎంఈ (CME) కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలిరోజు నిర్వహించిన ‘AI ఇన్ హెల్త్కేర్’ వర్క్షాప్నకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి సుమారు 50 మంది సీనియర్ వైద్యులు హాజరయ్యారు. క్లినికల్ డాక్యుమెంటేషన్, రోగులతో కమ్యూనికేషన్, వైద్య పరిశోధనలు మరియు చికిత్స నిర్ణయాలను వేగవంతం చేయడంలో AI ఆధారిత డిజిటల్ టూల్స్ను ఎలా ఉపయోగించవచ్చో ప్రాక్టికల్ డెమోల ద్వారా ఇందులో వివరించారు.
రెండవ రోజు జరిగిన ప్రధాన సదస్సుకు దేశం నలుమూలల నుండి సుమారు 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గర్భధారణ సమస్యలను ముందే గుర్తించడం, మారుమూల మరియు గిరిజన ప్రాంతాల మహిళలకు డిజిటల్ పద్ధతుల ద్వారా నిపుణుల వైద్య సేవలను అందించడం, శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం మరియు భద్రతను పెంచడం వంటి పలు కీలక అంశాలపై ఇక్కడ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే జూనియర్ డాక్టర్లకు AI ఒక “డిజిటల్ మెంటర్” లా ఎలా సహాయపడుతుందో వివరించారు.
ఈ సదస్సులో న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ నిపుణులు డాక్టర్ అశ్విని సేథియా వైద్య రంగంలో AI వాడకం వల్ల వచ్చే చట్టపరమైన, నైతికపరమైన బాధ్యతలపై మాట్లాడగా, ISCCP ప్రెసిడెంట్ డాక్టర్ అరుణా నిగమ్ గర్భాశయ క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించడంలో AI పాత్రను వివరించారు. డాక్టర్ భారతి అభ్యంకర్ నేతృత్వంలో జరిగిన ప్యానెల్ చర్చలో డాక్టర్ మమతా దీన్దయాళ్, డాక్టర్ అనితా కున్నియా, డాక్టర్ చిన్మయి పాల్గొన్నారు. ఏఐఎన్యూ రోబోటిక్ సర్జన్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్ “టెలిసర్జరీ” ద్వారా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా నిపుణుల సేవలను ఎలా అందించవచ్చో వివరించగా, ఫెహ్మికాన్ 2026 ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ ఎల్. ఫహ్మిదా భాను సర్జరీలలో AI తీసుకువస్తున్న ఖచ్చితత్వాన్ని తన ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సి. మల్లికార్జున, ఓఎస్డీ డాక్టర్ రాకేష్ శర్మ ప్రారంభించారు. ఇదే వేదికపై ఎం.జె. కాలేజ్ గౌరవ కార్యదర్శి డాక్టర్ జాఫర్ జావీద్ సాహబ్ చేతుల మీదుగా “ఫెహ్మికేర్ ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్” వర్చువల్గా ప్రారంభించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని, వారి నిర్ణయాత్మక శక్తిని, చికిత్స ఖచ్చితత్వాన్ని పెంచే ఒక అద్భుతమైన డిజిటల్ అసిస్టెంట్ మాత్రమేనని సదస్సు స్పష్టం చేసింది. రోగుల భద్రతను కేంద్రంగా ఉంచుకుంటూ, క్లినికల్ నైపుణ్యంతో AIని బాధ్యతాయుతంగా అనుసంధానించడమే మహిళల ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు అని ప్రకటిస్తూ ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది.
