తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువనాయకులు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు సొంత నిధులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రామ్ మల్లిక్ నాయుడు ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్–1” క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా ముగిసింది.
గత 20 రోజులుగా (ఏప్రిల్ 15 నుండి) మొత్తం 46 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ క్రీడా సంగ్రామంలో చీపురుపల్లి జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ముగింపు వేడుకల సందర్భంగా నేడు ఉదయం నాలుగు మండలాల నాయకుల మధ్య నిర్వహించిన ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ అందరినీ విశేషంగా అలరించింది.
ఈ పోటీలో మెరకముడిదాం మండల నాయకుల జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్ విజేతగా నిలిచింది. అనంతరం జరిగిన ప్రధాన ఫైనల్ మ్యాచ్లో బొండపల్లి, చీపురుపల్లి జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బొండపల్లి జట్టు 8 ఓవర్లలో 57 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో చీపురుపల్లి జట్టు కేవలం 5.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 58 పరుగులు సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రామ్ మల్లిక్ నాయుడు తీసుకున్న ఈ చొరవ అభినందనీయమని వారు కొనియాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో యువతకు, క్రీడలకు పెద్దపీట వేస్తామని వారు స్పష్టం చేశారు.
టోర్నమెంట్ విజేతగా నిలిచిన చీపురుపల్లి జట్టుకు రూ. 30,000 నగదుతో పాటు షీల్డ్, రన్నరప్గా నిలిచిన బొండపల్లి జట్టుకు రూ. 15,000 నగదు మరియు షీల్డ్ అందజేశారు. అలాగే మూడు మరియు నాల్గవ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 5,000 చొప్పున నగదు బహుమతులు మరియు షీల్డ్లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొని సందడి చేశారు.
