ఆంధ్రప్రదేశ్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. వైసీపీ హయాం నాటి చీకట్లను తొలగించుకుని మళ్లీ వెలుగులీనుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే అమరావతి రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి సొంతూళ్లకు వెళ్తున్న ఏపీ ప్రజలకు, రాజధాని ప్రాంతంలో కనిపిస్తున్న మార్పులు నమ్మకాన్ని పెంచాయి. జగన్ హయాంలో అసంపూర్తిగా బీడు భూమిగా వెక్కిరించిన అమరావతిలో ఇప్పుడు భారీ క్రేన్లు, వేలాది మంది కార్మికుల సందడి చేస్తున్నాయి.
హైదరాబాద్, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు ఏపీలో మళ్లీ పాజిటివ్ వాతావరణం నెలకొందని భావిస్తున్నారు. మన రాజధాని నిర్మాణం మొదలైంది..మన రాష్ట్రంలోనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం వారిలో బలంగా కనిపిస్తోంది. గతంలో తమ ఊరికి వెళ్లేందుకు భయపడిన వారు కూడా, ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలను చూసి మురిసిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ-అమరావతి కనెక్టివిటీ రోడ్లు, రాజధాని అంతర్గత రహదారుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటం వారిలో భరోసాను నింపింది.
ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన రహదారులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత ప్రభుత్వ హయాంలో గుంతలమయంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వం మిషన్ పాట్హోల్ ఫ్రీ స్కీమ్ ద్వారా కొత్త జీవం పోసింది. హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చే ప్రయాణికులు ఏపీ సరిహద్దు దాటగానే స్మూత్ రోడ్లపై సాఫీగా ప్రయాణిస్తూ పండగ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డు ప్రయాణం అంటేనే నరకం అనుకున్న రోజులు పోయాయంటూ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి వచ్చిన యువత, రాజధాని ప్రాంతంలో జరుగుతున్న డ్రోన్ సిటీ, ఐటీ పార్కుల పనులను ఆసక్తిగా గమనిస్తున్నారు.
కేవలం రోడ్లే కాదు, అమరావతి పరిధిలోని గ్రామాలు ఈ సారి పండుగ శోభతో సంతరించుకున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఇళ్లలో నిజమైన సంక్రాంతి కనిపిస్తోంది. పదేళ్ల నిరీక్షణకు ఫలితం దక్కుతోందని, తమ భూములకు మళ్లీ విలువ పెరిగిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు, సుందరీకరణ పనులు చూస్తుంటే అమరావతి రాష్ట్రానికే తలమానికంగా మారుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
