హైదరాబాద్లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కీలక పోక్సో (POCSO) కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.
2024లో నమోదైన ఈ కేసు వివరాల ప్రకారం, జల్పల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల ఆటో డ్రైవర్ మేత్రే అజయ్, తన సంరక్షణలో ఉన్న ఒక మైనర్ బాలికపై దారుణంగా లైంగిక దాడికి పాల్పడటంతో పాటు బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు.
ఈ ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 376, 448, 427, 506తో పాటు పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి ఏసీపీలు బి. శ్రీనివాస్ మరియు పి. లక్ష్మీకాంత్ రెడ్డి ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించి పక్కాగా దర్యాప్తు నిర్వహించగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభారాణి మరియు పి. సత్యనారాయణ కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో నిందితుడిపై నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల కఠిన శిక్షతో పాటు 42,000 రూపాయల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి 5,00,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ బృందం మరియు పోలీస్ సిబ్బంది సమన్వయంతో కృషి చేసి నిందితుడికి తగిన శిక్ష పడేలా చేయడాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
