ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో జరిగిన కీలక చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ చర్చల నుండి అర్ధాంతరంగా వెనుదిరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్తో జరిపిన సంప్రదింపులు పూర్తిగా విఫలమయ్యాయని జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చర్చల్లో అమెరికా ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని డిమాండ్ చేయగా, ఇరాన్ మాత్రం తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని పట్టుబట్టింది. ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది.
చర్చల అనంతరం జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ వైపు నుంచి ఎటువంటి సానుకూల నిబద్ధత కనిపించలేదని, తమ డిమాండ్లను అంగీకరించేందుకు వారు సుముఖంగా లేరని స్పష్టం చేశారు. ఈ చర్చల వైఫల్యం ఇరాన్కు ఖచ్చితంగా ఒక చెడు వార్త అని, ఆ దేశం తన మొండి వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని తేల్చిచెప్పిన అమెరికా, తదుపరి చర్యలపై అప్రమత్తంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
