జగన్ రెడ్డి తన ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ప్రజా ధనాన్ని సొంత ప్రచారం కోసం ఖర్చు చేసే అధికారం జగన్ కు ఎక్కడదని ప్రశ్నించారు. పాస్ పుస్తకాలను కూడా తప్పుల తడకగా ప్రచురించారని, తన బొమ్మ, భూమికి సంబంధించిన ఒకటి రెండు వివరాలు తప్ప ఏ ఒక్కటీ అందులో సరిగ్గా లేదని అన్నారు. తాము రాజముద్రతో పాస్ పుస్తకం ఇచ్చామని, అందులో దాదాపు 15కు పైగా భద్రతా అంశాలను జోడించి ఇచ్చామని చెప్పారు.
అబద్దాలను అలవాటుగా చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి భూములు, రీ సర్వేపై అసత్యపు విషం కక్కారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
అప్పుడే రీ సర్వేను అత్యాధునిక టెక్నాలజీతో చేసేందుకు ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే రీ సర్వేను కనిపెట్టినట్లు క్రిమినల్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్ కు లేదన్నారు.
చంద్రబాబు కాలిగోటి కూడా జగన్ సరిపోడన్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను పూర్తిగా తప్పుల తడకగా నిర్వహించిందని, అందుకే ప్రజలు రీ సర్వే పై తమ ప్రభుత్వానికి 2.7 లక్షల ఫిర్యాదులు చేశారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని ప్రజల భూములను భక్షించేందుకు వీలుగా రీ సర్వేను నీరు కార్చారన్నారు.
అందువల్లే గత ప్రభుత్వ రెవెన్యూ పాపాలపై 70 శాతం ప్రజల నుండి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలకు భూములు అమ్మనివారని బెదిరించేందుకు ఆ భూములన్నీ 22ఎ నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం భారీ స్తాయిలో భూ సంస్కరణలను అమలు చేస్తోందని, రెవెన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేసి 22ఎ భూములను చాలా వరకు నిషేధిత జాబితా నుండి తొలగించిందని చెప్పారు.
జగన్ రెడ్డి క్రెడిట్ మాకు అక్కర్లేదు
చంద్రబాబు 8 పదుల వయస్సులోనూ ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నారని, ఇప్పుడు కూడా దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అదీ ఆయన క్రెడిట్ అని అన్నారు. అయితే గులకరాయి, కోడి కత్తి, బాబాయి గొడ్డలి లాంటివి జగన్ రెడ్డి క్రెడిట్ అని, ఆ క్రెడిట్ తమకు అస్సలు అక్కర్లేదని అన్నారు.
తమకు అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమని, హెల్తీ, వెల్తీ, హ్యపీ సమాజం కోసం పనిచేయడమే తమ నాయకుని లక్ష్యమని అన్నారు. అర్బన్ ప్రాంతంలో భూముల విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట రేట్ల పెంపుదలపై కసరత్తు చేస్తున్నామని, ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
