హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విశాఖపట్నం మధ్యన దూరం 125 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే సుమారు నాలుగైదు గంటల ప్రయాణ సమయమూ తగ్గుతుంది.
ఇంతకీ ఈ కొత్త హైవే ఎక్కడ నిర్మిస్తున్నారంటే.. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల 4 లేన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి దాదాపుగా పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా ఈ హైవేని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేషనల్ హైవే 65లో హైదరాబాద్ – విజయవాడ మధ్య సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకొంటే ఖమ్మం వెళ్లొచ్చు.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే 365 బీజీ ద్వారా ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని దేవరపల్లి దగ్గర ఎన్హెచ్ 16తో అనుసంధానం అవుతుంది.
అక్కడి నుంచి కొవ్వూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డి గూడెం వరకు ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించింది. ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పూర్తయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేవారికి దూరంతో పాటు ట్రావెల్టైమ్ గణనీయంగా తగ్గుతుంది. సరకు రవాణాకు సమయంతో పాటు పెద్ద మొత్తంలో ఇంధనం ఆదా అవుతుంది. తద్వారా సరకు రవాణా ఖర్చులు తగ్గితే.. అనేక వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
