స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో సీఎం మొత్తం 36కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రేపు ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ముఖ్యమంత్రి, అక్కడి నుంచి అమరావతికి బయల్దేరనున్నారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో మూడు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.
అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 మంది ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కు పైగా సెషన్లు, సమావేశాలకు హాజరైన సీఎం, ఈ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో జరుగుతున్న మార్పులు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలను తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసుకోవడంలో ఈ సదస్సు ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.
మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న విజయాలు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వివరించగలిగామని సీఎం పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు మరింత ఆసక్తి చూపుతున్నాయని, యువ శక్తి, సమర్థ నాయకత్వం, అనుకూల పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతీ రంగంలో కంపెనీలకు భారత్లో విస్తృత అవకాశాలు ఏర్పడుతున్నాయని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
దావోస్ పర్యటనలో భాగంగా యూరప్లోని తెలుగు ప్రజలతో మమేకమై తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. మొత్తంగా, దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు, పారిశ్రామిక అవకాశాల దిశగా కీలక ముందడుగు పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
