తొలి వెలుగు జర్నలిస్టు రఘుకు ఎన్ ఐ ఏ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎం ఎల్ ఏ, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ వ్యవస్థాపక కార్యదర్శి చంటి క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. బూటకపు ఎంకౌంటర్ అంటూ ప్రజాసంఘాలు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న నేపధ్యంలో ఎన్కౌంటర్ సమయంలో జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత మీడియా కు ఉంటుంది.
అటువంటి బాధ్యతనే తెలంగాణ మీడియా కూడా నెరవేర్చింది. గతంలో కూడా వందల ఎంకౌంటర్ ల సమయంలో మీడియా అక్కడికి వెళ్లి వాస్తవాలను సేకరించి ప్రజలకు తెలియజేసింది. మీడియా లో వచ్చిన కథనాల ఆధారంగా న్యాయస్థానాలు కూడా విచారణకు ఆదేశించాయి. ఆయినా ఏనాడు మీడియా సంస్థలకు దర్యాప్తు సంస్థలు ఇటువంటి నోటీస్ లు ఇవ్వలేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తీయజేస్తున్నారనే అక్కసుతోనే ఈ నోటీసులు ఇచ్చారని ఇక్కడ అర్థమవుతుంది.
ఇటువంటి వైఖరి కరెక్టు కాదు అని క్రాంతి కిరణ్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తుల పట్ల, దేశ సమగ్రతకు భంగం కలిగించే వ్యక్తులు సంస్థల పట్ల ఎం ఐ ఏ లాంటి సంస్థలు కఠినంగా వ్యవహరించాలి. కానీ దేశంలోని రాజ్యాంగం సక్రమంగా అమలు జరగాలని, రాజ్యాంగ హక్కులు ప్రజలకు దక్కాలని పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం కరెక్టు కాదు. ఎన్ ఐ ఏ ఇచ్చిన నోటిసులు వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రఘుకు అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రతి జర్నలిస్ట్ కు ఒక జర్నలిస్ట్ గా తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
