సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలని, బలమైన సమాజాన్ని నిర్మించినప్పుడే బలమైన దేశం తయారవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రధానమంత్రి కలలు కంటున్న వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆర్థికంగా సాధికారత సాధించాలన్నారు.
వనపర్తిలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య సాదర స్వాగతం పలికారు.
కలెక్టరేట్ ఆవరణలో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్, ఆ వెంటనే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్, విద్యార్థుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను తిలకించారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్,జిల్లా ఎస్పి డి.సునీతరెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కను నాటారు. అనంతరం గవర్నర్ తో జిల్లా అధికారులు, ప్రముఖులు ఫోటో దిగారు. జిల్లాకు చెందిన విద్య, వైద్యం, క్రీడలు, రచనలు, సామాజిక సేవ వివిధ రంగాలలో 12 మంది ప్రముఖులు తమ తమ రంగాల్లో నిర్వహించిన సేవలను సమావేశంలో వివరించారు.
జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు ఏ. దినకర్ బాబు విశ్రాంత ఐఏఎస్, పద్య కవి ఆకుల శివరాజ లింగం, పద్య కవి సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగిపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు పెరవల్లి గాయత్రి, శిల్పి భైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిని రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్ రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ తమ పరిచయాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
