కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళను కాటికి పంపారు వైద్యులు. భర్త యోగయ్య, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన యాదగిరి లక్ష్మి (20) కడుపు నొప్పితో బాధపడుతూ వినుకొండ పట్టణంలోని మాధవ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యురాలు లక్ష్మికి వైద్యం చేసి సాయంత్రం వరకు సెలైన్ పెట్టి మందులు ఇచ్చి పంపించారు.
ఇంటికి వెళ్లిన లక్ష్మీ శనివారం సాయంత్రం వైద్యులు ఇచ్చిన మందులు వేసుకున్న కాసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. వైద్యురాలు నిర్లక్ష్యంగా చికిత్స చేయటం వలనే తన భార్య నిండు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
నిర్లక్ష్యం వైద్యం వికటించి తన భార్య ప్రాణాలను బలి కొన్నారని ఇటువంటి వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేతకాని వైద్యం చేసి లక్ష్మీని చంపేసిన వైద్యురాలు లైసెన్స్ రద్దుచేసి, ఆసుపత్రిని సీజ్ చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు.
చిన్న కడుపునొప్పితో నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని వైద్యులు ఇచ్చిన మందులతో ఇంటికి వెళ్లి టాబ్లెట్లు వేసుకోగానే తన భార్య మృతి చెందిందని, మృతికి సంబంధించిన కారణాలు తేల్చాలని మృతురాలి కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి లక్ష్మీ మృతికి కారణమైన వైద్యురాలను అరెస్టు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
