జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై పూర్తి దృష్టి సారించారు. పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపడుతూ, ఇప్పటికే బలంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను మరింత పటిష్టం చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేల, నియోజకవర్గ ఇన్చార్జ్ల పనితీరుపై సమగ్ర నివేదికలు సేకరిస్తుండగా, కొన్నిచోట్ల కీలక మార్పులు జరగనున్నాయన్న చర్చ జరుగుతోంది.
వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు, వీర మహిళలతో చర్చలు కొనసాగిస్తున్న పార్టీ కేంద్ర కార్యాలయ బృందం, క్షేత్రస్థాయి సూచనలను కూడా నమోదు చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలపై, ఇన్చార్జ్లపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారికి తనదైన శైలిలో చర్యలు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కమిటీల నిర్మాణం, కూర్పు విషయంలో కూడా పవన్ కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే రోజుల్లో జనసేనలో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
