ఉమ్మడి అనంతపురం జిల్లాకు మరో భారీ ప్రాజెక్టును గిఫ్ట్గా ఇచ్చేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. కంచిపట్టు నేతకు ప్రసిద్ధి చెందిన ధర్మవరం చేనేతల చిరకాల కోరిక నేరవేర్చే దిశగా కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. దాదాపు 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ త్వరలోనే సాకారం కానుంది.
రూ.38 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలపగా..సాంకేతిక కమిటీ సమీక్ష పూర్తయింది. వారం, పది రోజుల్లో మరో సమావేశం జరగనుంది. తదనంతరం శాంక్షన్ ఆర్డర్ను విడుదల చేయనున్నారు. ఇక, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడమే కాకుండా ధర్మవరంలో 9.84 ఎకరాల్ని కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుతో చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 25 వేల మందికి ఉపాధి లభించనుంది. క్లస్టర్ ఏర్పాటులో భాగంగా 90 శాతం రాయితీతో నేతన్నలకు మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్లు, ఇతర 12 రకాల నేత పరికరాలను అందిస్తారు.
మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ 5 దశల్లో నిర్మాణం జరగనుంది. తొలి దశలో ఎంపిక చేసిన చేనేత లబ్ధిదారులకు మగ్గం, ఇతర పరికరాలు అందిస్తారు. వర్క్షెడ్లను కొన్నింటిని నిర్మిస్తారు. రెండో దశలో మరికొందరికి పరికరాలు, సామూహిక వర్క్షెడ్లు, డిజైన్ స్టూడియో, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, డిస్ప్లే కమ్ షోరూం, కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ హాళ్లు, వేర్ హౌస్లను అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో మార్కెటింగ్ డెవలప్మెంట్ సెంటర్, బ్రాండింగ్ కోసం పబ్లిసిటీ సెంటర్ ఏర్పాటు నాలుగో దశలో విలువ జోడింపు కేంద్రం ఐదో దశలో డై హౌసెస్ నిర్మాణం జరుగుతుంది.
