అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో తన సొంత స్థలం కూడా కోల్పోయానని మంత్రి నారాయణ చెప్పారు. 2001లో రాష్ట్రం విడిపోకముందే విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో తాను కొనుగోలు చేసిన 60 సెంట్ల స్థలం ఇన్నర్ రింగ్ రోడ్డుకు అలైన్ మెంట్ లో ఉందన్నారు. అయితే వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలతో అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ తనపై కేసులు పెట్టారని అన్నారు.
ఇటీవల భవనం నిర్మాణం కోసం సీఆర్డీఏకు దరఖాస్తు చేసినప్పుడు తన స్థలం విషయం బయటపడిందన్నారు. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నందున ఎక్కువగా స్పందించనని అన్నారు. అమరావతి పర్యటనలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ స్పందించారు.
సోమవారం ఉదయం అమరావతిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న భవనాలను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. గెజిటెడ్ అధికారుల కోసం నిర్మిస్తున్న టైప్ – 1,టైప్ -2 తో పాటు గ్రూప్ – డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న క్వార్లర్లను పరిశీలించి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
పర్యటన ముగిసిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఉద్యోగులు,అధికారుల కోసం మొత్తం 4026 ఇళ్లను నిర్మిస్తున్నాం. ఈ ఇళ్ల నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భవనాల లోపల అంతర్గత పనులు, మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయి.
ఎలక్ట్రికల్,పంబ్లింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత ప్రభుత్వం మూడు ముక్కలాటలో రాజధానిని పక్కనపెట్టేసి రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఇక్కడ పనులు చేసిన కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన మెటీరియల్ తీసుకెళ్లనివ్వకుండా వారి టెండర్లు కూడా రద్దు చేయకుండా ఇబ్బందులు పెట్టింది.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి న్యాయసమస్యలు రాకుండా అధికారుల కమిటీ వేసి టెండర్లు పిలిచాం. టెండర్లు పూర్తయ్యాక నవంబర్ వరకూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో పనులు వేగంగా జరగలేదు. గత మూడు నెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ టెండర్ల కాలపరిమితి ప్రకారం పూర్తిచేస్తాం.
ప్రభుత్వ భవనాలతో పాటు ప్రయివేట్ సంస్థల నిర్మాణాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వర్షాకాలం నాటికి అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేస్తాం. మూడేళ్లలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం అని అన్నారు.
