మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఇల్లు లేని పేదలు ఇళ్ల స్థలాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు కావస్తున్న ఇంతవరకు దరఖాస్తుదారుల దరఖాస్తులు పరిశీలించలేదని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ అన్నారు. ఈ మేరకు ఎంటిఎంసీ పరిధిలోని చిర్రావూరులో సోమవారం స్థానిక సమస్యలపై, సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ అధ్యక్షతన జరిగింది.
అనంతరం జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇల్లు లేని పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలంగా ఇచ్చి ఇల్లు నిర్మాణం చేపడతామని వాగ్దానం చేశారని అన్నారు.
ఈ వాగ్దానాన్ని అమలు జరిపే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ఎంతోకాలం ఎదురుచూసిన పేదలు గత నవంబర్ 17వ తేదీన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కార్యాలయం వద్ద వేలాదిమంది సమీకృతమై ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగిందన్నారు .
ఆ దరఖాస్తులను ఇప్పటివరకు కనీసం పరిశీలన చేసి అర్హుల జాబితాను అధికారులు ఇంతవరకు ప్రకటించలేదని ఆయన విమర్శించారు . పైగా ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసేసామని మాట్లాడుతున్నదని ఇలాంటి నేపథ్యంలో అర్హులైన పేదలందరూ ఇళ్ల స్థలాల సాధన కోసం ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని నేతాజీ హెచ్చరించారు.
సాక్షాత్తు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నియోజకవర్గం లోనే ఈ పరిస్థితి ఉందని, ఇతర ప్రాంతాల్లో అయితే పేదల గురించి ఆలోచించే నాధుడు కూడా లేడని అన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో 20వేల మంది వివిధ స్థలాలలో ఇల్లు వేసుకుని నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇస్తానని ప్రకటించిన మంత్రి లోకేష్ ఏడాదిన్నర క్రితం మొదటి విడత పట్టాలు మంజూరు పేరుతో 3000 మందికి పట్టాలి ఇచ్చారని, మిగతా వారందరికీ దశలవారీగా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారని అన్నారు.
ఏళ్ళు గడుస్తున్న రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు చేపడతారనేది ఆగమ్య గోచరంగానే ఉందని అన్నారు. తక్షణమే ఇళ్ల స్థలాల మంజూరు చేసి, ఇల్లు వేసుకున్న వారికి పట్టాల జారీ కార్యక్రమం చేపట్టకపోతే పేదలందరూ ఐక్యమే పోరాటాలకు దిగుతారని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం తాడేపల్లి రూరల్ కార్యదర్శి పల్లె కృష్ణ రూరల్ మండల నాయకులు బొప్పన గోపాలరావు, నాగ పోగు విజయ రాజు తదితరులు పాల్గొన్నారు.
