అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సంప్రదాయ కొమ్ము నృత్యంతో ఆమెకు ఘనస్వాగతం పలికారు. రంపచోడవరం యూత్ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జీఎస్ఎల్ మరియు జీఎస్ఆర్ ఆసుపత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ శిబిరానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. భువనేశ్వరి స్వయంగా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మొత్తం 12 రకాల వైద్య సేవలను ప్రారంభించిన ఆమె, అనంతరం ‘న్యూట్రిఫిల్’ ద్వారా జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రత మరియు డయాబెటిస్ వంటి అంశాలపై వైద్యులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అంతకుముందు వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, మాజీ ఎమ్మెల్యేలు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, గత 29 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో నిరంతర సేవలు అందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్పూర్తితో ఈ ట్రస్టును స్థాపించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత రంగాల్లో ట్రస్ట్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
మారుమూల గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఇక్కడ పరీక్షల అనంతరం అవసరమైన వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు.
ట్రస్ట్ సాధించిన విజయాలను వివరిస్తూ.. ఇప్పటివరకు 16,365 హెల్త్ క్యాంపుల ద్వారా 22.64 లక్షల మందికి సేవలు అందించామని, రూ. 22.97 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. అలాగే 2,083 మొబైల్ క్యాంపులను కూడా నిర్వహించినట్లు తెలిపారు. విద్యారంగంలో 2,113 మంది అనాథ పిల్లలను ఆదుకోవడంతో పాటు, కోట్లాది రూపాయల స్కాలర్షిప్లను పేద విద్యార్థులకు అందించామని వివరించారు.
బ్లడ్ బ్యాంకుల ద్వారా లక్షలాది మందికి రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా నిలిచామని గుర్తుచేశారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ దాతలు తమపై ఉంచిన నమ్మకం వల్లే సాధ్యమవుతున్నాయని, దాతల సహకారమే తమ బలమని భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
