మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాపు నాయకుడిగా చెప్పుకుంటున్న అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలించారు. గత ఏడాది నవంబర్ 12న జరిగిన ఒక ఆందోళన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పీటీ (Prisoner Transit) వారెంట్పై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
గతేడాది నవంబర్ 12న వైసీపీ చేపట్టిన ఆందోళనలో భాగంగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ సమయంలో అంబటి రాంబాబు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.గుంటూరుకు చేరుకున్న అనంతరం అంబటి రాంబాబును పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ వేయగా, అంబటి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
వీటిపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగే అవకాశం ఉంది.ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే అంబటి రాంబాబు రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 40కి పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. వరుసగా పీటీ వారెంట్లు జారీ అవుతుండటంతో అంబటి రాజకీయంగా మరియు న్యాయపరంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
