ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గానూ ఆయనను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, గత 18 నెలల్లోనే భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి తమ కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు..ప్రధానంగా నవ్యాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మార్చడంపైనే ఫోకస్ పెట్టారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 10.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు.
లులు గ్రూప్, అశోక్ లేలాండ్ వంటి సంస్థలతో తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టించడమే కాకుండా..వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏపీ ఈజ్ బ్యాక్ అనే నినాదంతో చంద్రబాబు చేస్తున్న కృషిని కార్పొరేట్ ప్రపంచం గుర్తించదనడానికి ఈ అవార్డు నిదర్శనం. ఈ అవార్డు ఎంపికలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన జ్యూరీ చంద్రబాబు పాలనా దక్షతను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ జ్యూరీ, చంద్రబాబును ఒరిజినల్ CEO ముఖ్యమంత్రిగా ప్రశంసించింది. పాలనలో టెక్నాలజీని జోడించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులను వేగవంతం చేయడం, అమరావతి, వైజాగ్లను జాబ్ క్రియేషన్ హబ్లుగా మారుస్తుండటాన్ని జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.
విపత్తుల సమయంలోనూ, ముఖ్యంగా విజయవాడ వరదల వేళ చంద్రబాబు చూపిన నాయకత్వ పటిమ కూడా జ్యూరీని మెప్పించింది. మొత్తానికి, 2025లో బిజినెస్ రిఫార్మర్గా ఎంపిక కావడం ద్వారా జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండ్ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టారు చంద్రబాబు. ఈ అవార్డుతో ఏపీ మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్షోభాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయకత్వానికి ఈ పురస్కారం నిదర్శనం.
