బడ్జెట్లో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచాలని ప్రతిపాదించడంతో, ఆదివారం మధ్యాహ్నం ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. అలాగే, అన్ని వర్గాల షేర్హోల్డర్లకు సంబంధించిన బైబ్యాక్ ఆదాయాలను క్యాపిటల్ గెయిన్స్గా పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
ప్రారంభ ట్రేడింగ్లో ఊగిసలాటకు లోనైన 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్, బడ్జెట్ ప్రసంగం సమయంలో కొంత కోలుకున్నప్పటికీ, లాభాలన్నింటినీ కోల్పోయి ఆపై భారీ పతనానికి గురైంది. మధ్యాహ్నం ట్రేడింగ్లో సెన్సెక్స్ 2,370.36 పాయింట్లు (2.88%) పడిపోయి 80,000 స్థాయికి దిగువగా 79,899.42 వద్ద ట్రేడ్ అయింది.అదే సమయంలో 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 748.9 పాయింట్లు (2.95%) నష్టపోయి 24,571.75 వద్ద కొనసాగింది.సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు 6.50 శాతం క్షీణించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్ వంటి షేర్లు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇక సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లు లాభాల్లో నిలిచాయి. “ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ముఖ్యంగా STT పెంపు వల్ల తక్షణ కాలంలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల (FPI) ప్రవాహాలపై స్వల్ప ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా డెరివేటివ్ ఆధారిత గ్లోబల్ ఫండ్లకు ఇది దెబ్బ కావచ్చు,” అని చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్టు ఆకాష్ షా వ్యాఖ్యానించారు.ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,251.37 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆదివారం సెలవుల కారణంగా ఆసియా మార్కెట్లు మూసివుండగా, అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 296.59 పాయింట్లు (0.36%) పడిపోయి 82,269.78 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98.25 పాయింట్లు (0.39%) నష్టపోయి 25,320.65 వద్ద ముగిసింది.
