నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
నల్లగొండను “సూపర్ స్మార్ట్ సిటీ”గా తీర్చిదిద్దుతానని గతంలోనే ప్రకటించిన ఆయన, ఆ దిశగా పనులను వేగవంతం చేశారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొదటి మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంత్రి స్వయంగా రంగంలోకి దిగి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 5 గంటల నుండే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రకాశం బజార్ ప్రాంతంలో పర్యటిస్తూ నగర పారిశుధ్యం మరియు ఇరుకు రోడ్ల వెడల్పు పనులను స్వయంగా తనిఖీ చేస్తున్నారు.
ముఖ్యంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రోడ్డు వెడల్పు పనులు, ఆక్రమణల తొలగింపుపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ప్రస్తుతం జేసీబీలతో పనులు శరవేగంగా కొనసాగుతుండగా, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ మంత్రి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
నల్లగొండ నగరాన్ని అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
