ముఖ్యంశాలుహోమ్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

#SridharBabu

సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. జపాన్‌కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ (Toho Koki Seisakusho Co. Ltd.) సహకారంతో టీ-వర్క్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… తెలంగాణను దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ లక్ష్య సాధనలో తాజాగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో వాఫర్‌ను సమతలంగా మార్చేందుకు ఉపయోగించే ఈ సీఎంపీ ప్యాడ్లను ప్రస్తుతం పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

ఈ హబ్ ఏర్పాటుతో ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ తొలిసారిగా దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటులోకి వచ్చిందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, పరిశ్రమలకు ఈ కేంద్రం ద్వారా శిక్షణతో పాటు పరిశోధనలు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామన్నారు.

ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో సీఎంపీ ప్యాడ్లను దేశంలోనే తయారు చేసేలా సంయుక్త పరిశోధనలు చేపడతామని వివరించారు. సెమీకండక్టర్ రంగంలోని అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు జపాన్ లాంటి దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు.

పరిశోధన నుంచి చిప్‌ల తయారీ వరకు అవసరమైన సమగ్ర ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి టకుయా నిషిమురా, జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ స్వస్తిక్ కులకర్ణి, ఇండోబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డైసుకే టాంజి, జపాన్ ఇండియా బిజినెస్ బ్యూరో ఛైర్మన్ షిగెమారో యాసుయి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-వర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.

Related posts

విమానం కూలి అజిత్ పవర్ మృతి

Satyam News

జీవిత ఖైదీలు ఇక జీవిత భాగస్వాములు….

Satyam News

జగన్‌కి అందని ఢిల్లీ పల్స్‌…. మోదీ దూకుడుతో మైండ్‌ బ్లాంక్‌….!!

Satyam News

హృద్రోగానికి తొలిసారిగా అల్ట్రా-ఫాస్ట్ Q-డాట్ అబ్లేషన్

Satyam News

కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే

Satyam News

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News

Leave a Comment