అంబులెన్స్ దగ్ధం అయిన దురదృష్టకర సంఘటనలో నవజాత శిశువు, ఒక డాక్టర్ తో బాటు మరి కొందరు మరణించారు. గుజరాత్లోని అర్వల్లి జిల్లాలో మోదాసా సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున ఈ భయానక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక నూతన శిశువు, వైద్యుడు, నర్సు, మరో వ్యక్తి అగ్నికి ఆహుతయ్యారు. మోదాసా-ధన్సురా రోడ్డుపై రాత్రి 1 గంట సమయంలో అంబులెన్స్లో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
జననం తర్వాత అనారోగ్యానికి గురైన ఒక రోజు వయసున్న శిశువును మోదాసాలోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్లోని మరో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో శిశువు, అతని తండ్రి జిగ్నేష్ మోచి (38), అహ్మదాబాద్కు చెందిన వైద్యుడు శాంతిలాల్ రెంటియా (30), అర్వల్లికి చెందిన నర్సు భూరిబెన్ మనాట్ (23) ఉన్నారు. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ అంకిత్ తో పాటు జిగ్నేష్ మోచి బంధువులు గౌరాంగ్ మోచి, గీతాబెన్ మోచి తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్ను సమీప పెట్రోల్ బంక్ వద్ద ఆపడానికి ప్రయత్నించినట్టు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. ముందు సీట్లో ఉన్న డ్రైవర్, మోచి బంధువులు గాయాలతో బయటపడగా, వెనుక భాగంలో ఉన్న శిశువు, అతని తండ్రి, వైద్యుడు, నర్సు బయటపడలేక అగ్నిలో చిక్కుకుని మరణించారు.
స్థానిక అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నప్పటికీ, నాలుగురిని రక్షించలేకపోయారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ మనోహర్సింగ్ జడేజా తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించామని ఆయన స్పష్టం చేశారు.
