తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యంను అధికారులు అరెస్ట్ చేశారు. నాణ్యత లేని నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూల తయారీలో ఉపయోగించేందుకు అనుమతించిన అంశాల్లో ఆయన కీలక పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అరెస్టు అనంతరం సుబ్రహ్మణ్యంను తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి విచారణ కోసం ఆయనను నెల్లూరుకు తరలించిన పోలీసులు, అక్కడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెయ్యి సరఫరా ఒప్పందాలు, టెండర్ ప్రక్రియ, నాణ్యత పరీక్షలలో జరిగిన లోపాలు, అవకతవకలు, అవినీతి అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గత కొద్ది రోజులుగా సాక్ష్యాలను సేకరిస్తోంది.
ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మందిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అరెస్టైన వ్యక్తుల వివరాలు, సరఫరాదారుల పాత్ర, అధికారుల ప్రమేయం వంటి అంశాలపై సిట్ క్రాస్ చెకింగ్ చేస్తోంది. తిరుమల లడ్డూలలో ఉపయోగించే నెయ్యి నాణ్యత సమస్య బయటపడ్డ తర్వాత టీటీడీ ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగలడంతో, దర్యాప్తు అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జీఎం సుబ్రహ్మణ్యం అరెస్టు కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. విచారణలో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
