ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబానికి మరో పదవి దక్కింది. ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవలె నాగబాబును క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ ఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్ రిచ్ మెంట్ (ఏపీ గ్రీన్) కు కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నియమించారు. ఆయనకు గతంలో మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా అది తీరకపోవడంతో ఏపీ గ్రీన్ లో పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించినప్పుడు జనసేన నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మితకు నామినేటెడ్ పదవి వచ్చింది. ఆమెను విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
