ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం మొత్తం 56 వినతిపత్రాలు అందాయని ప్రజావాణి అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రజల నుంచి స్వయంగా దరఖాస్తులను స్వీకరించి, ఒక్కో అర్జీదారుడి సమస్యను ఓపికగా విని, సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలు, సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్జీపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి, అర్హత మేరకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని హెచ్చరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించి, పెండింగ్ లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందిని జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో సభ్యత్వం నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవ సహాయం,డిఆర్ఓ పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
