ఖమ్మంహోమ్

భూ రీ-సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

#Ponguleti

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌లో జిల్లాలో భూముల రీ-సర్వే ప్రగతి, అటవీ-రెవెన్యూ భూ సమస్యలు, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై ఆయన అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. జిల్లాలో సర్వే పనులు మరింత వేగంగా ముందుకు సాగాలని, ఎక్కడా జాప్యానికి తావులేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు కొనసాగుతుండగా, ఐదు గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు వివరించారు. మిగిలిన గ్రామాల్లోనూ నిర్దేశిత కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్లు, రోవర్ పరికరాల కొరత రాకుండా అవసరమైన చోట అదనపు వనరులను సమకూర్చుకోవాలని ఆదేశించారు.

సమన్వయంతోనే భూ సమస్యల పరిష్కారం

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అటవీ-రెవెన్యూ భూ సమస్యలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రతి నెలా సమీక్షా సమావేశాల ద్వారా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే.. గతంలో పోడు సాగు చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వ విధానాల ప్రకారం, మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

శ్రీనివాసగుట్టకు పర్యాటక శోభ

పాల్వంచలోని శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

చిలకలూరిపేట లో పల్స్ పోలియో

Satyam News

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

Satyam News

AI ప్రభావం: 20 లక్షల ఉద్యోగాలకు కోత

Satyam News

అమరావతి కి వచ్చిన ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’

Satyam News

మన అవయవాలు కాపాడుకోవడం ఎలా?

Satyam News

Leave a Comment