రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వార్షిక నాయకుల సదస్సులో పాల్గొనడానికి ఆయన భారత్ చేరుతున్నట్లు శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పర్యటనలో భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు ‘ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేసే దిశగా రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
అలాగే ఇరుదేశాలకు ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. రెండు దేశాలు ఈ శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించారు.
పుతిన్ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఆంక్షలను విస్తరించే సూచనలు చేసినప్పటికీ, భారత్–రష్యా సంబంధాలు కొత్త ఊపును సంతరించుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణ వినిపిస్తోంది.
ఈ సందర్శన సందర్భంగా రక్షణ, అణుశక్తి, వాణిజ్య విమానయాన, ఆర్థిక రంగాలు సహా పలు విభాగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా చర్చలు జరగనున్నాయి. ఇరుదేశాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ రష్యా పలు రక్షణ ఒప్పందాల అంచున ఉన్నాయి.
బ్రహ్మోస్ క్షిపణుల పరిధిని విస్తరించడం, సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాల అప్గ్రేడ్, ఎస్–400 వైమానిక రక్షణ వ్యవస్థకు అదనపు యూనిట్లు కొనుగోలు, అలాగే సుఖోయ్ 57ఈ కొత్త స్టెల్త్ జెట్ను భారత్లో తయారు చేసే అవకాశాలపై కూడా చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది.
