ప్రజలకు పైసా పని చేయకపోయినా.. అప్పనంగా అధికారం తెచ్చిపెట్టే ఫ్యాక్టర్ ఏదైనా ఉందీ అంటే అది కులమే. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కులాన్నే నమ్ముకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. పార్టీ పెట్టిన రోజు నుంచి కమ్మ కులం మీద ద్వేషంతో.. ఆ సామాజిక వర్గం మీదం విషం చిమ్ముతూ ఆయన చేసిన రాజకీయాలు అందరూ చూశారు.
కొన ఊపిరితో ఉన్న వైసీపీని.. మళ్లీ పరుగులు పెట్టించడానికి కాదు కదా… కనీసం నడిపించడానికైనా.. కమ్మ ద్వేషం ఒక్కటే సరిపోవడం లేదు. అందుకే ఈసారి కాపులపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. 2019 నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకున్న వైపీపీ.. ప్రస్తుతం ఆ స్ట్రాటజీకి అదనంగా కాపు ఓటర్లను మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇంతకాలం పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టిన వాళ్లతో.. కాపులను దారిలోకి తెచ్చుకోవడం జరిగే పని కాదని ప్యాలెస్ పెద్దలకూ తెలుసు. అందుకే ఈసారి కొత్త పాత్రలను రంగంలోకి దించారు. ఐపీఎస్ పోస్టులో ఉంటూనే జగన్ వీర విథేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైపీఎస్ సునీల్ కుమార్.. కాపులను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
దళితులతో చేతులు కలిపితే కాపు నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇస్తున్నారు సునీల్ కుమార్. ఆయన మాటల ప్రకారం.. వైఎస్ జగన్ ఇక ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని అనుకోవాలా..? లేక ఇదంతా జగన్ క్యాస్ట్ పోలిటిక్స్లో భాగమా.. అని ఆలోచిస్తే.. జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి.. ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్.. వైసీపీ పెద్దలతో కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే అని చెప్పాల్సి వస్తుంది.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం.. ప్రజల జీవితాలను బాగు చేస్తామని చెబితే.. అవన్నీ చేయడానికి చాలా కష్టపడాలి.. అంత కష్టం ఎందుకు అనుకొంటే.. వైసీపీ వీరాభిమానులు చెబుతున్నట్లు.. ఆ కులంలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాం.. ఈ కులంలో మరొకరిని ఉపముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇస్తే చాలు. మరి ఇంకోసారి జగన్ అండ్ కో రెడీ చేస్తున్న కుల ఉచ్చులో పడతారా.. లేక ఆ రోచ్చుకి దూరంగా ఉంటారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లోనే ఉంది.
