రాజకీయాల్లో జెండాలు వేరుండొచ్చు కానీ, ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుండె మాత్రం ఒక్కటే ఉండాలి. అందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఈ ఘటన.
వైసీపీ వీరాభిమాని అయిన భాస్కర్ తన తండ్రి రోడ్డు ప్రమాదంలో మెదడులో రక్తం గడ్డకట్టి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే, తన ఆరాధ్య దైవం జగన్ మోహన్ రెడ్డి ని సాయం కోరుతూ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో నిరంతరంగా మొరపెట్టుకున్నాడు. తోటి కార్యకర్తలు కూడా జగన్ ని ట్యాగ్ చేస్తూ సాయం చేయమని అభ్యర్థించారు.
కానీ, మూడు రోజుల ఎదురుచూపుల తర్వాత ఆవేదనతో ఉన్న భాస్కర్.. ఊహించని విధంగా నిన్న నారా లోకేష్ ని ట్యాగ్ చేశాడు. ఈ పిలుపుకి ప్రత్యర్థి పార్టీ నేత అని చూడకుండా మంత్రి లోకేష్ ఇవ్వాళ స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. “మీ తండ్రి గారి పరిస్థితి విని బాధపడ్డాను, నా టీమ్ వెంటనే మిమ్మల్ని సంప్రదించి అవసరమైన సాయం అందిస్తుంది” అంటూ భరోసా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.
చిత్రమేమిటంటే, లోకేష్ స్పందించిన15-19 నిమిషాల్లో సాక్షి ఛానల్ స్క్రోలింగ్లో.. జగన్ గారు వైసీపీ నేత రాంబాబు కుటుంబానికి రూ. 2.5 లక్షల సాయం చేసినట్లు వార్త రావడం గమనార్హం.
ఒక సామాన్య కార్యకర్త తన కష్ట కాలంలో తన సొంత పార్టీ నుండి ఆశించిన స్పందన రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అవతలి పక్షం నుండి అందిన స్పందన నిజమైన మానవత్వానికి నిదర్శనం.
రాజకీయ యుద్ధాలు కేవలం ఎన్నికలకే పరిమితం కావాలి. కష్టం అని ఒకరు చేయి చాచినప్పుడు, ఆ చేయి ఏ జెండా పట్టుకుంది అని చూడకుండా ఆదుకోవడమే అసలైన రాజనీతి. జెండాలు వేరైనా, మనుషుల ప్రాణాలు కాపాడటంలో చూపించే ఈ చొరవ నిజంగా అభినందనీయం. భాస్కర్ తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
