భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృష్టి, తన విభాగపు అధిపతి (HOD) డాక్టర్ పర్వేజ్ వేధింపులు తాళలేక మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని ప్రాణాలు విడిచారని సమాచారం. ఈ విషాద ఘటనపై ఎన్హెచ్ఆర్సి సభ్యుడు ప్రియాంక్ కానూంగో సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు.
బాధిత డాక్టర్ తన హెచ్ఓడీ నుండి ఎదురవుతున్న వేధింపులు, అవమానాలపై గతంలోనే మూడుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎయిమ్స్ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. పైగా ఈ వ్యవహారాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారని కమిషన్ పేర్కొంది. ఈ ఫిర్యాదును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సి.. భోపాల్ పోలీసులు, ఎయిమ్స్ భోపాల్ యాజమాన్యం మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఒక యువ వైద్యురాలి మరణం పట్ల కానూంగో తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కేసులో నిష్పాక్షిక విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
