నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. అధైర్యపడొద్దంటూ భరోసా కల్పిస్తున్నారు. రాజధాని రైతుల సమస్యలు స్వయంగా తానే పరిష్కరిస్తానని, పర్యవేక్షిస్తానని చెప్పారు. ఆంధ్రుల రాజధాని ప్రపంచస్థాయిలో ఉండాలని, అందుకు తగ్గట్లుగా పని చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజధాని కోసం ఇప్పటికే ఇచ్చిన 33 వేల ఎకరాల భూములకు తోడు మరో 44 వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు.
రైతుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చంద్రబాబు. అమరావతి ప్రాంత అభివృద్ధి సంఘం పేరిట రైతులంతా జేఏసీగా ఏర్పడాలన్నారు చంద్రబాబు. ఇందులో రైతులు సభ్యులుగా చేరితే తమ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి గొప్ప వేదిక అవుతుందన్నారు. అమరావతి నిర్మాణంలో రైతులను భాగస్వామ్యం చేశామనీ గుర్తు చేశారు. రైతుల త్యాగాలను గౌరవిస్తూ వారికి మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు చంద్రబాబు. రైతుల సమస్యల పరిష్కారానికి కొందరు డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రైతులు ఏ సమస్యతో వచ్చినా అధికారులు వారిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడైనా రైతుల నుంచి రూపాయి తీసుకున్నట్టు తెలిసినా సంబంధిత ఉద్యోగి, శాఖాధికారిపై చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో కూడా రైతులకు మరింత మేలు చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే నియమించిన త్రిసభ్య కమిటీ రైతుల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించనున్నట్లు పేర్కొన్నారు.
