పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో జీవించే ఉన్నాడా? ఆయన పరిస్థితిపై ఆయన కుమారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలుగా ఆయన జీవించి ఉన్నారనే స్పష్టమైన ఆధారాలు లేకపోవడం, కోర్టు ఆదేశించా కూడా ములాఖాత్ లను అధికారులు అడ్డుకోవడం కుటుంబాన్ని మరింత భయాందోళనలకు గురిచేస్తోందని ఆయన కుమారుడు కాసిమ్ ఖాన్ తెలిపారు.
తన తండ్రి గురించి కొన్ని నెలలుగా తమకు ఎలాంటి ధృవీకరించదగిన సమాచారమూ అందడం లేదని చెప్పారు. “మా తండ్రి సురక్షితంగా ఉన్నారా, గాయపడ్డారా, లేక జీవించి ఉన్నారనే అనుమానమే ఒక మానసిక యాతనలా మారింది” అని కాసిమ్ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడిని కూడా అధికారులు ఏడాది కంటే ఎక్కువ కాలంగా చూసేందుకు అనుమతించలేదని కుటుంబం ఆరోపిస్తోంది.

ఈ వ్యవహారంపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయితే ఒక జైలు అధికారి తన పేరు వెల్లడించలేదు కానీ, ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని, అతన్ని అధిక భద్రతా జైలుకు మార్చే ప్రణాళికల గురించి తనకు తెలియదని చెప్పారు. 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్పై పలు కేసుల్లో శిక్షలు విధించారు. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవేనని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు.
మొదటి కేసు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పొందిన బహుమతులను అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలతో (టోషాఖానా కేసు) సంబంధించింది. అనంతరం ఓ రహస్య దౌత్య లేఖను లీక్ చేశారన్న ఆరోపణపై 10 ఏళ్ల శిక్ష, అలాగే అల్–ఖాదిర్ ట్రస్ట్కు సంబంధించిన వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై మరో 14 ఏళ్ల శిక్ష విధించారు. ఆయన పార్టీ పీటీఐ, ఇవన్నీ ఆయనను ప్రజా జీవితం నుంచి, ముఖ్యంగా ఎన్నికల నుంచి దూరం చేయడానికే చేస్తున్న కేసులేనని ఆరోపిస్తుంది.
ఇమ్రాన్ ఖాన్పై సమాచారం అందకపోవడం కుటుంబ ఆందోళనను మరింత పెంచింది. ఆయన పేరును, చిత్రాన్ని టెలివిజన్ ఛానళ్లు ప్రసారం చేయొద్దని చెప్పడంతో, జైల్లో ఉన్నప్పటి ఒక మసకబారిన కోర్టు ఫోటో మాత్రమే ప్రజలకు కనిపిస్తోంది. “ఈ ఒంటరితనం ఉద్దేశపూర్వకమే,” అని కాసిమ్ ఆరోపిస్తూ, అధికారాలు ఆయనను ప్రజల నుంచి దూరంగా ఉంచుతున్నాయని అన్నారు.
“ప్రభుత్వానికి ఆయన్ను ఎదుర్కోలేమనే భయం ఉంది. పాకిస్థాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఆయనే.” అని అన్నారు. లండన్లో తల్లి జెమిమా గోల్డ్స్మిత్తో నివసించే కాసిమ్, సులేమాన్ ఇస్సా ఖాన్ ఇద్దరూ పాకిస్థాన్ రాజకీయాల నుంచి ఎప్పుడూ దూరంగా ఉన్నారు. తమ తండ్రిని “అబ్బా” అని పిలుచుకునే ఈ సోదరులు, అరుదుగా మాత్రమే పబ్లిక్గా మాట్లాడుతారు.
2022 నవంబర్లో హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత చూసిన ఇమ్రాన్ ఖాన్దే తమకు చివరి జ్ఞాపకమని కాసిమ్ చెప్పారు. “ఆ దృశ్యం ఇప్పటికీ మాకు మిగిలే ఉంది. ఇప్పుడు వారాల తరబడి పూర్తిగా నిశ్శబ్దం నెలకొన్న ఈ పరిస్థితిలో ఆ జ్ఞాపకానికి మరింత భారం పెరిగింది.
”కుటుంబం దేశీయ, అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం కొనసాగిస్తోందని, కోర్టు ఆదేశించిన జైలు భేటీలను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నామని కాసిమ్ తెలిపారు. “ఇది కేవలం రాజకీయ వివాదం కాదు. ఇది మానవ హక్కుల అత్యవసర పరిస్థితి. ప్రతి దిశ నుంచి ఒత్తిడి రావాలి. మేము ఆయన నుంచే బలాన్ని పొందుతున్నాం… కానీ ఆయన సురక్షితంగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలి,” అని కాసిమ్ అన్నారు.
