రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ” ట్రాఫిక్ మేనేజ్మెంట్ & రోడ్ సేఫ్టీ బ్యూరో” ఏర్పాటు దిశగా తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ రోడ్డు భద్రతపై ఈ నూతన సంస్థ ఏర్పాటు గురించి బుధ వారం రోజున డీజీపీ సి.వి. ఆనంద్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్డు భద్రత సంస్థ నిర్మాణం, విధులు, సిబ్బంది, సంస్థ చేపట్టాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలు, పరిపాలనా విధానాలపై డీజీపీ ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రోడ్ సేఫ్టీ బ్యూరో బలోపేతం చేయడం, సంబంధిత శాఖలతో సమన్వయం పెంచడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించాలని, మరో సారి పోలీస్ అధికారుల తో సమావేశం కూడా నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిజిపి సి వి ఆనంద్ తో పాటుగా, డి జి (ఆర్గనైజేషన్) స్వాతి లక్రా, రోడ్ భద్రత విభాగం ఐ జి రమేష్ నాయుడు, ఐ జి (పి & ఎల్) గజరావు భూపాల్, జాయింట్ సిపిలు సన్ ప్రీత్ సింగ్ సింగ్, జోయల్ డేవిస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
