హైడ్రా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన విపత్తు ప్రతిస్పందన శిక్షణను పూర్తి చేసిన 78 మంది యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్డీఎంఏ యువ ఆపద మిత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిక్షణలో స్వీయ రక్షణ, రక్షణ చర్యలు, ప్రకృతి విపత్తుల సమయంలో తొలి స్పందన, అగ్నిప్రమాదాల నివారణ, వరదల సమయంలో రక్షణ చర్యలు, ప్రాథమిక ప్రాణరక్షణ నైపుణ్యాలపై దృష్టి సారించారు.
నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంపికైన వాలంటీర్లను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించాలని, తొలి స్పందనదారులుగా ముందుకు రావాలని, వివిధ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి శిక్షణ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, విపత్తుల సమయంలో సమర్థంగా స్పందించి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రాయోగిక నైపుణ్యాలు అందాయని వాలంటీర్లు తెలిపారు.
