అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ యువతిని భారత్ కే చెందిన ఆమె ప్రియుడు మర్డర్ చేసి పారిపోయిన దారుణ సంఘటన జరిగింది. మెరిల్యాండ్ రాష్ట్రం ఎలికాట్ సిటీకి చెందిన నికితా గోదిశాల (27) జనవరి 2న కనిపించడం లేదని ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. మెరిల్యాండ్లోని ఒక అపార్ట్మెంట్లో కత్తిపోట్లకు గురై మరణించిన స్థితిలో నికితా మృతదేహం పోలీసులకు లభ్యమైంది.
దాంతో హోవర్డ్ కౌంటీ పోలీసులు మర్డర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొలంబియాకి చెందిన ఆమె ప్రియుడు అర్జున్ శర్మ (26) ఈ నేరానికి పాల్పడ్డట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేసి అతని అరెస్టుకు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతను ఆమెను హత్య చేసి భారత్కు పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వాషింగ్టన్ డీసీలోని భారతీయ దౌత్య కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, నికితా కుటుంబ సభ్యులతో సంప్రదింపులో ఉన్నామని, అవసరమైన అన్ని కాన్సులర్ సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. “ఈ వ్యవహారాన్ని స్థానిక అధికారులతో కూడా ఎంబసీ ఫాలోఅప్ చేస్తోంది” అని పేర్కొంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అర్జున్ శర్మే నికితా మిస్సింగ్ ఫిర్యాదును పోలీసులకు ఇచ్చాడు. డిసెంబర్ 31న తన అపార్ట్మెంట్లోనే చివరిసారిగా నికితాను చూసినట్లు అతడు తెలిపాడు. అయితే, జనవరి 2న మిస్సింగ్ ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ భారత్కు వెళ్లే విమానంలో దేశం విడిచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
తదుపరి రోజు పోలీసులు అతడి అపార్ట్మెంట్లో సర్చ్ వారెంట్ అమలు చేసి నికితా మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా, డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల తర్వాత కొద్ది సమయంలోనే అర్జున్ శర్మ నికితాను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఇప్పటివరకు హత్యకు గల కారణం తెలియరాలేదని హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మను గుర్తించి అరెస్ట్ చేసేందుకు అమెరికా ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని వారు పేర్కొన్నారు.
