వైసీపీ చీఫ్ జగన్ ఫ్యూచర్ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు విజయసాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మధురోతో జగన్ను పోల్చుతూ ఆయన ట్వీట్ చేశారు. అమ్ముడు పోయిన కోటరీల మధ్య బంధీలుగా ఉన్న నాయకులారా ఇప్పటికైనా ఆలోచించుకోండి అంటూ హెచ్చరికలు పంపారు విజయసాయి రెడ్డి.
విజయ సాయి రెడ్డి పూర్తి ట్వీట్ ఇదే
అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి! వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పాలెస్ నుండి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవటమే కదా..!
జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి తరుణంలో విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన సిట్ ముందు అనధికారికంగా అప్రూవర్గా మారి కీలక విషయాలు వెల్లడించారని సమాచారం. ఒకవేళ ఈడీ ముందు విచారణకు హాజరైతే విజయసాయి రెడ్డి ఎలాంటి విషయాలు బయటపెడతారన్నది ఆసక్తిగా మారింది.
అత్యంత ప్రజాదరణ, సైన్యం, ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ మధురోను అమెరికా ఎలా తీసుకెళ్లిందో, అలాగే సరైన వ్యక్తులు చుట్టూ లేకపోతే భవిష్యత్తులో జగన్కు ఇబ్బందులు తప్పవని విజయసాయి రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.
