ఒక్క పనితో రెండు ప్రయోజనాలు సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పనుల్లో భాగంగా ఐకానిక్ హైకోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకొంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనం కోసం మొత్తం 45 వేల టన్నుల స్టీల్ను వినియోగించనున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన భవన నిర్మాణం కోసం వినియోగించే ఉక్కును.. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ చర్య ద్వారా అమరావతి నిర్మాణాల్లో పటిష్టమైన.. నాణ్యమైన ఉక్కును వినియోగించడంతో పాటు.. విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ ఆర్డర్లు ఇవ్వడం ద్వారా.. సంస్థను ఆర్ధికంగా బలోపేతం చేసినట్లు అవుతోంది.
25 వేల కోట్ల భారీ నష్టాల్లో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీ పెద్దలను ఒప్పించి.. వైజాగ్లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు సుమారు 15 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని సాధించారు. కేంద్ర ప్రభుత్వం 12 వేల 500 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడి రూపంలో నిధులు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం 3 వేల కోట్ల విలువైన రాయితీలను ప్రకటించింది.
అమరావతిలో 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు భవనం నిర్మిస్తున్నారు. ఇందులో 52 కోర్టు హాళ్లు రానున్నాయి. రెండు, నాలుగు, ఆరో అంతస్తుల్లో సాధారణ కోర్టు హాళ్లు ఉంటాయి. టాప్ ఫ్లోర్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. కోర్టు హాలును ఏర్పాటు చేస్తారు. మిగిలిన అంతస్తులను.. లైబ్రరీలు, సమావేశ మందిరాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులకు కేటాయించారు. హైకోర్టు భవనంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, అధికారుల నివాస గృహాల నిర్మాణంలోనూ వైజాగ్ స్టీల్ను వినియోగిస్తున్నారు. అంటే ఒకవైపు రాజధాని నిర్మాణంతో పాటు.. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ స్థాయిలో రెవెన్యూ అందిస్తున్నారు.
