నియోజకవర్గం స్థాయిలో ఒక లాజిక్ కరెక్ట్ అయితే.. స్టేట్ లెవెల్లోనూ ఆ లాజిక్ రైట్ అవ్వాలి. ఆ లెక్కన ఏపీలో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదు. ఇది మీడియా రిపోర్టు కాదు.. విశ్లేషకుల అభిప్రాయమూ కాదు.. స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న ఫార్ములా. దీని ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సే లేదు. అదెలా అంటే.. జగన్ జంబ్లింగ్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకొంటే.. మొత్తం క్లియర్గా అర్ధమవుతుంది.
గత ఎన్నికల్లో చాలా స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చేసి ఇతర ప్రాంతాలకు పంపించారు. ఎందుకంటే.. ఆ స్థానాల్లో వారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని.. ఏం చేసినా వాళ్లు అక్కడ గెలిచే ఛాన్స్ లేదనే సమాధానం వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ ఇదే జంబ్లింగ్ ఫార్ములాని అమలు చేస్తున్నారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనిని.. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించారు. అక్కడ ఓటమి తర్వాత ఆమెను రేపల్లెకు వెళ్లమన్నారు. అటు చిలకలూరిపేటలో గానీ, ఇటు గుంటూరులో గానీ విడుదల రజనీ గెలవదని.. తేల్చేశారు పార్టీ అధినేత జగన్రెడ్డి. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇదే ఫార్ములాని రాష్ట్ర స్థాయిలో అప్లయ్ చేస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన మీద ఏపీ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. 151 స్థానాల నుంచి 11 సీట్లకు పడిపోవడం.. వైసీపీ మీద ప్రజల్లో ఎంత నెగిటివిటీ ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. 20 నుంచి 30 శాతం తేడాతో ఓడిపోయిన వాళ్లు మళ్లీ గెలిచే ఛాన్స్ లేదని సూత్రీకరిస్తే.. 90 శాతానికి పైగా తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయిన వైసీపీ.. ఏపీలో మళ్లీ గెలవదు అని చెప్పడానికి నోబెల్ సైంటిస్టులు అవసరం లేదు. జగన్ సొంత ఫార్ములా ఉపయోగిస్తే చాలు.
