వైసీపీ కీలక నేతలు.. జగన్కి హ్యాండ్ ఇస్తున్నారా.. సొంత తమ్ముడు, బాబాయ్ కూడా.. ఫ్యాన్ పార్టీకి టాటా చెప్పేస్తున్నారా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు. రాజ్యసభలో అరడజను మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో సగం మంది పదవీ కాలం వచ్చే జూన్ నాటికి ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుపై లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన సగం మంది ఎంపీలు కూటమి పార్టీల్లోకి దూకేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. టీటీడీ ఛైర్మన్గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల నెయ్యి కల్తీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకొంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో కొనసాగడం కంటే.. బీజేపీలో చేరితే సేఫ్గా ఉండొచ్చనే ఆలోచనలో వైవీ సుబ్బారెడ్డి ఉన్నారట. ఇక జగన్కి సోదరుడు.. కడప ఎంపీ అవినాశ్రెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినాశ్రెడ్డి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుని సీబీఐ మళ్లి విచారించాలని ఈ మధ్యే సుప్రీం కోర్టు ఆదేశించింది.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పీవీ మిధున్రెడ్డి కూడా బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసులో మిధున్రెడ్డి అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న మిధున్రెడ్డి.. బీజేపీలో చేరడానికి ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే వీరిని పార్టీలో చేర్చుకోవడానికి.. బీజేపీ సిద్ధంగా ఉందా అనేదే ప్రశ్న. వైసీపీలో ఉన్నా.. వీరంతా పార్లమెంటులో బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్లను పార్టీలో చేర్చుకోవడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఉండదు. వైసీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసినా.. ఆ పార్టీ క్యాడర్ కూడా వీరితో వస్తుందనే గ్యారెంటీ లేదు. సంప్రదాయంగా కాంగ్రెస్కి మద్దతిచ్చే వైసీపీ ఓటు బ్యాంకు.. బీజేపీకి జైకొట్టే అవకాశాలు తక్కువ. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేతలను చేర్చుకొనే విషయంలో ఢిల్లీ పెద్దల నిర్ణయం కోసం అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
