తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని, ఈ విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై జరిగిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వెంకటేశ్వర స్వామి తమ ఇంటి కులదైవమని, తమ ఊరి నుంచి చూస్తే స్వామివారి నామాలు కనిపిస్తాయని చెప్పారు. ప్రతి శనివారం ఉపవాసం ఉండి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం తమ కుటుంబంలో ఉందన్నారు. అలిపిరి బ్లాస్ట్ ఘటనలో సాధారణంగా అయితే బతికే అవకాశం లేదని, ఆ సమయంలో వెంకటేశ్వర స్వామే తనను కాపాడారని, తనను బ్రతికించారని చంద్రబాబు భావోద్వేగంగా చెప్పారు.
భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దు
గత ఐదేళ్లలో వెంకటేశ్వర స్వామికి అపచారాలు జరిగాయని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని తాము స్పష్టంగా చెప్పినా వినలేదన్నారు. రాముడి విగ్రహ శిరచ్ఛేదనం ఘటనపై వాస్తవాలు అడగడానికి వెళ్లిన తనపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే కందిరీగలు కాల్చాయని చెప్పారని, ఆంజనేయ స్వామి విగ్రహం తోక విరగ్గొడితే ‘బొమ్మే కదా ఇంకొకటి పెట్టుకోండి’ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లకు దేవుడంటే లెక్కలేదని, బ్రిటీష్ పాలకులు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం మహాపాపమని అన్నారు. వాళ్లు బూతులు తిట్టినా తామే భరించాలట, తామే క్షమాపణ చెప్పాలట అంటూ ప్రశ్నించారు. “మేము అంత నిస్సహాయులుగా కనిపిస్తున్నామా?” అని నిలదీశారు. ఈ విషయంలో సీబీఐ ఎక్కడా కల్తీ జరగలేదని చెప్పలేదని, అయినా ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అసత్యాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న కరడుగట్టిన నేరస్తులు
కరుడు గట్టిన నేరస్తులు అసత్యాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని డూప్లికేట్ చేయాలని ఎన్నో ఆలయాల్లో ప్రయత్నాలు జరిగి విఫలమయ్యాయని, తిరుమల లడ్డూకు ఉన్న రుచి, వాసన మరే లడ్డూకు రాదన్నారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. శ్రీవారి భక్తుడిగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే తన ఉద్దేశమని తెలిపారు.
దోషులకు అన్ని రకాలుగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, వన్ మెన్ కమిటీ అధ్యయనం అనంతరం కఠిన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కత్తిని తన చేతిలో పెట్టాలని ప్రయత్నించారని, ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారంలోనూ అదే తరహా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. “దౌర్జన్యం, రౌడీయిజం చేస్తామంటే మీ ఆటలు సాగవు” అంటూ హెచ్చరించారు.
డిక్లరేషన్ పై సంతకం పెట్టని జగన్
వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతోనే అబ్దుల్ కలాం డిక్లరేషన్పై సంతకం చేశారని, అదే నమ్మకం ఉంటే జగన్ ఎందుకు డిక్లరేషన్పై సంతకం పెట్టలేదని ప్రశ్నించారు. దేవుడి పవిత్రతను కాపాడలేని అసమర్థులం కాదని స్పష్టం చేశారు. ముందు మాధవ సేవ, ఆ తర్వాతే మానవ సేవ అని అన్నారు. దేవుడి పవిత్రతను కాపాడడమే నిజమైన మాధవ సేవ అని పేర్కొన్నారు.
సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకునే జగన్, నెయ్యి కల్తీ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తప్పు చేసినందుకు కనీసం చెంపలేసుకుని క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. పరకామణిలో దేవుడి సొమ్ము దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేస్తారా? దోచుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడని సమర్థించుకుంటారా? అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.
